ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తాం: కవిత హెచ్చరిక

  • ఏపీ ప్రభుత్వం, జనసేన కలిసి నాగేశ్వర్‌ను వేధిస్తున్నాయని ఆరోపణ
  • తెలంగాణ మేధావిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి
  • భద్రాచలం ఘటనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనా విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే సీఎం చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను జనసేన పార్టీ, ఏపీ పోలీసులు, అక్కడి ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తున్నాయని మండిపడ్డారు.

పార్టీలకు అతీతంగా విశ్లేషణలు చేసే నాగేశ్వర్‌పై ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించి కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు గౌరవించే ఒక మేధావిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్‌లో నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు.

ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై కూడా కవిత విమర్శలు చేశారు. భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ వాహనం ఇవ్వకపోవడంతో, వడదెబ్బ మృతుడి కుటుంబం మృతదేహాన్ని కిలోమీటరుకు పైగా భుజాలపై మోసుకెళ్లిన ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రేవంత్ రెడ్డిది అమానవీయ ప్రభుత్వమని, పేదల పట్ల ఎంత నిర్దయగా ఉందో అర్థమవుతోందని కవిత ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

Kavitha Kalvakuntla
Professor Nageshwar
Chandrababu Naidu
Telangana Rakshana Sena
AP Government
Arrest threat
Bhadrachalam
Telangana Government
Revanth Reddy
Heatstroke death

More Telugu News